సమాజ మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలి
టీఆర్పీ జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్
కొత్తకోట,జనవరి19(తెలంగాణ ముచ్చట్లు):
సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలంటే యువత రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ అన్నారు. యువత కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వంతో ముందుకు వస్తేనే దేశ ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని ఆయన పేర్కొన్నారు.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొత్తకోట మండలం యూత్ అధ్యక్షులుగా ఎండి. రఫీక్ను నియమిస్తూ నియామక పత్రాన్ని జి. రవికుమార్ అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ సూచనలతో ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జి.రవికుమార్ మాట్లాడుతూ.. యువత సంకల్పబలంతో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నుంచే కాకుండా చట్టసభల వరకూ యువత ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి యువ నాయకులు కృషి చేయాలని సూచించారు.నూతనంగా నియమితులైన మండల యూత్ అధ్యక్షుడు ఎండి. రఫీక్ మాట్లాడుతూ.. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, యువతను చైతన్యపరచేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.


Comments