నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.
పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ డిమాండ్.
వనపర్తి,సెప్టెంబర్01( తెలంగాణ ముచ్చట్లు):
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.టీజీఈజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఆరు కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీజీఈజేఏసీ అధ్యక్షుడు అశోక్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే బాధ్యత ఉద్యోగులదేనని, అలాంటి ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరిని వీడి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సెక్రటరీ జనరల్ ఎస్.వరప్రసాద్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.అనంతరం ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అడిషనల్ కలెక్టర్ వినోద్కుమార్కు సమర్పించారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు జీసీ రాజు, రవిప్రసాద్ గౌడ్, మహేష్, హరిప్రసాద్, నరసింహులు గౌడ్, వెంకటేష్, రామిరెడ్డి, సత్యనారాయణ, రామన్ గౌడ్, జగపతిరావు, గిరీష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉద్యోగులకు టీజీఈజేఏసీ బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments