దామెర రైతులకు అందుబాటులోకి రైతు మార్కెట్.
ఎల్కతుర్తి, ఆగస్టు 30 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ రైతులకు తమ పంటలకు స్థానికంగానే మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో దామెర గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన రైతు మార్కెట్ (కూరగాయల మార్కెట్)ను ఆదివారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మంకని పద్మ చేరాలు, ఉపసర్పంచ్ మద్దే కుమార్, బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు కలిసి రైతు మార్కెట్ను ప్రారంభించారు.
ప్రతి ఆదివారం నిర్వహించనున్న ఈ రైతు మార్కెట్ ద్వారా దామెర గ్రామంలో కూరగాయలు పండించే రైతులు తమ ఉత్పత్తులను దూర ప్రాంతాలకు తీసుకెళ్లకుండా గ్రామంలోనే నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు, సమయం ఆదా కావడంతో పాటు తమ పంటలకు మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందన్నారు.
‘మన పంట.. మన గ్రామం.. మనకు మనమే’ అనే ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ రైతు–వినియోగదారుల మధ్య నేర సంబంధాన్ని పెంపొందించడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు తాజా కూరగాయలు నేరుగా రైతుల వద్ద నుంచే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
దామెరలో పండించిన కూరగాయలకు దామెరలోనే మార్కెట్ కల్పించడం ద్వారా స్థానిక రైతులకు ప్రోత్సాహం లభించడంతో పాటు గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో రైతు మార్కెట్ను మరింత విస్తరించి ఎక్కువ మంది రైతులు, కూరగాయల సాగుదారులు, చిన్న వ్యాపారులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దామెర గ్రామ సర్పంచ్ మంకని పద్మ చేరాలు, ఉపసర్పంచ్ మద్దే కుమార్, బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


Comments