టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న విస్డం కళాశాల యాజమాన్యం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని విస్డం కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీలు (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తిప్పించుకుంటోందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీల
ను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
విస్డం కళాశాలను ఇతర ప్రాంతాలకు విక్రయించిన నేపథ్యంలో ద్వితీయ సంవత్సరం చదవాల్సిన విద్యార్థులకు టీసీలు అందించాలని పలుమార్లు కోరుతున్నప్పటికీ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకుండా విద్యార్థులను పదేపదే కళాశాల చుట్టూ తిప్పించుకుంటోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి చదువులు, భవిష్యత్తుపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి ఎలాంటి జాప్యం లేకుండా టీసీలు అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత టీసీలు అందజేస్తామని కళాశాల యాజమాన్యం లెటర్ప్యాడ్పై రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.
అయితే హామీ మేరకు రేపు సంబంధిత ధ్రువపత్రాలు అందించకపోతే విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గట్టు సాయిరాం, జవ్వాజి అనిల్, నలఘశ హరీష్ యాదవ్, నరెంగుల శివ, సాయి, రాజు, కౌశిక్, వినయ్తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments