సదరం సర్టిఫికెట్ కోసం ఏడాదిగా ఎదురుచూపులు.
నిమ్స్లో ధ్రువీకరణ.. కరీంనగర్లో సర్టిఫికెట్కు నిరాకరణ?
తిమ్మాపూర్, ఆగస్టు 24(తెలంగాణ ముచ్చట్లు ):
జన్యులోపంతో నడవలేని స్థితిలో ఉన్న తిమ్మాపూర్ మండలానికి చెందిన బాలుడు అడిచర్ల ప్రసాద్కు సదరం సర్టిఫికెట్ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ సర్టిఫికెట్ జారీ కాలేదని అతని తండ్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులకు తన కుమారుడి సమస్యను వివరించారు.
తన కుమారుడు జన్యులోపంతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడని, హైదరాబాద్లోని నిమ్స్ వైద్యులు ఇప్పటికే వైద్యపరంగా ధ్రువీకరించారని శ్రీనివాస్ తెలిపారు. నిమ్స్ వైద్యుల ధ్రువీకరణ ఉన్నప్పటికీ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం సదరం సర్టిఫికెట్ జారీ చేయడం లేదని ఆయన వాపోయారు.
సదరం సర్టిఫికెట్ కోసం గత ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని, ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లినా ఇబ్బందులు ఎదురవుతున్నాయని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ లేకపోవడంతో తన కుమారుడికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న పలు ప్రయోజనాలు పొందలేకపోతున్నామని తెలిపారు.
తన కుమారుడి పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి, నిమ్స్ వైద్యుల ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుని సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని శ్రీనివాస్ కోరారు. సమస్యను త్వరగా పరిష్కరించి తన కుమారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అధికారులను విజ్ఞప్తి చేశారు.


Comments