శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత యుగేందర్–అనురాధ దంపతుల ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న వారి కుమార్తె, అల్లుడు గంది నిఖిల్ తేజ్–నేత్రి దంపతులతో పాటు మనవళ్లు ఆరుష్, అనీష్లకు శ్రీ అయ్యప్పస్వామి సంపూర్ణ కృపాకటాక్షాలు లభించాలని, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
శరణుఘోషలతో మారుమోగిన ఆలయం
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో దీక్షాధారులైన అయ్యప్ప స్వాములకు భక్తిశ్రద్ధలతో మహాభిక్ష ఏర్పాటు చేశారు. స్వాముల భజనలు, ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో మారుమోగింది.
కార్యక్రమంలో అయిత మోహన్, దివ్యతో పాటు స్థానిక ప్రముఖులు, భక్తులు, అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి విచ్చేసిన స్వాములందరికీ అయిత యుగేందర్–అనురాధ దంపతులు స్వయంగా భోజన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం స్వాముల ఆశీస్సులు అందుకున్నారు.


Comments