శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండ.!
- రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయం.
- ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం.
- వ్యవసాయ భూమి కేటాయింపునకు హామీ.
అశ్వారావుపేట, సెప్టెంబరు 1(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్లోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకె శిరీష అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ–శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం చౌటిగూడెం గ్రామానికి చేరుకున్న వారు శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీడీఏ ద్వారా అవసరమైన సహాయం అందిస్తామని, కుటుంబ జీవనోపాధికి కొంతమేర వ్యవసాయ ప్రభుత్వ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. శిరీష కుటుంబానికి వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. న్యాయం జరిగే వరకు కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.


Comments