భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి విముక్తి కోసం సాగిన మహా పోరాటం.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగం సాగించిన పోరాటం చరిత్రలో మహత్తరమైనదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు అన్నారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాములు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది బలిదానాలు చేశారని, పేదలకు సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు.
“బాంచన్ దొరా.. నీ కాళ్లు మొక్కుతా” అనే బానిసత్వ సంస్కృతి నుంచి “దొర ఏందిరో.. వాణ్ణి పీకుడు ఏందిరో” అనే ఆత్మగౌరవ భావనను ప్రజల్లో నింపిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని రాములు అన్నారు.
తెలంగాణ ప్రాంతంలో సాగిన సామాజిక, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిందని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్, నిమ్మల మనోహర్, డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి విజయ్, సీపీఐ ఎల్కతుర్తి మండల సహాయ కార్యదర్శి ఆరెపల్లి చంద్రమౌళి, ఇంజాల పోచయ్య, జూపాక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments