ముల్కనూర్ సహకార ప్రగతిపై గ్రూప్–2 అధికారులకు అవగాహన.
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 13(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్–2 అధికారుల కోసం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంయుక్త ఫౌండేషన్ కోర్సులో భాగంగా సుమారు 220 మంది అధికారులు ముల్కనూర్ కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీని సందర్శించారు. రెండు బ్యాచ్లుగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ పర్యటన జరిగింది.
ఈ సందర్భంగా సొసైటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సతీష్ సంస్థ చరిత్ర, పరిపాలనా విధానం, రైతులకు అందిస్తున్న రుణ సేవలు, విత్తన ఉత్పత్తి–మార్కెటింగ్, రైస్ మిల్లులు, కాటన్ జిన్నింగ్, గోదాములు, వ్యవసాయ ఇన్పుట్స్, బీమా తదితర కార్యకలాపాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అధికారులతో సమావేశమై ముల్కనూర్ సహకార నమూనా, ఆర్థిక క్రమశిక్షణ, రుణాల రికవరీ, మార్కెట్ ఆధారిత కార్యకలాపాలు, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలను వివరించారు. ఆధునిక వ్యవసాయంలో ఏఐ, ఉపగ్రహ పర్యవేక్షణ, డ్రోన్ సాంకేతికత వినియోగంతో రైతుల ఆదాయం, వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై చర్చించారు.
ప్రభుత్వ అధికారులు రైతులు, ప్రజల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుని, వారి పనులు, ఫైళ్ల పరిష్కారంలో వేగం, పారదర్శకతతో పనిచేయాలని ప్రవీణ్ రెడ్డి సూచించారు. అనంతరం అధికారుల భవిష్యత్ విధి నిర్వహణకు శుభాకాంక్షలు తెలిపారు.
ముల్కనూర్ సహకార నమూనాను ప్రత్యక్షంగా పరిశీలించడం గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార రంగంపై తమకు ఎంతో ఉపయోగకరమైన అనుభవాన్ని అందించిందని
గ్రూప్–2 అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ జనరల్ మేనేజర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments