విద్యుత్ సిబ్బంది విధుల నిర్వహణలో భద్రత పాటించాలి.
33/11 కేవీ తాటికొండ విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించిన ఏడీఈ రణధీర్ రెడ్డి.
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది, సబ్స్టేషన్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘనపూర్ విద్యుత్ ఆపరేషన్ ఏడీఈ పాల్వాయి రణధీర్ రెడ్డి సూచించారు. శనివారం మండల పరిధిలోని 33/11 కేవీ తాటికొండ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా సబ్స్టేషన్ నుంచి వివిధ గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతున్న 11 కేవీ ఫీడర్లతో పాటు వాటి బ్యాటరీలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సరఫరాలో ఏర్పడే అంతరాయాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. విద్యుత్ పరికరాలు దెబ్బతినకుండా ట్రిప్పింగ్ ద్వారా రక్షించే బ్యాటరీల పనితీరును గంటగంటకు పరిశీలించాలని ఆపరేటర్లకు సూచించారు.
విద్యుత్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా వన్ మినిట్ రూల్ విధానాన్ని కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు సహచరులను కూడా రక్షించుకోవచ్చని తెలిపారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ భద్రతపై నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ సరఫరా ఏర్పాట్లను విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షణలోనే చేపట్టాలని గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఘనపూర్ ఏఈ పి. శంకర్, లైన్మెన్ సురేందర్ రెడ్డి, ఏఎల్ఎం సోమరాజు తదితరులు ఏడీఈ రణధీర్ రెడ్డి వెంట ఉన్నారు.


Comments