ఎల్కతుర్తి సొసైటీపై నామినేటెడ్ పాలన ఎందుకు?
-రైతుల తీర్పును ఎందుకు నిరాకరిస్తున్నారు?
-బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్
ఎల్కతుర్తి సెప్టెంబర్11 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి విశాల సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలన కొనసాగించడంపై బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలకు సంబంధించిన సహకార సంఘంలో రైతులు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశం లేకుండా నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్లను నియమించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.
సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన సంస్థలని, వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చడం సరైన విధానం కాదన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే రైతులు తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉంటుందని, మరి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలన కొనసాగించాల్సిన అవసరం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సొసైటీలో సుమారు రూ.3.20 కోట్ల మేర నిధులు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో, ఆ నిధులు, సొసైటీ ఆస్తులు, రైతుల ప్రయోజనాలకు పూర్తి భద్రత ఉందా? అని ప్రశ్నించారు. గతంలో సొసైటీకి సంబంధించిన అవకతవకలు, ఆర్థిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిందా? ప్రస్తుతం సొసైటీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? నిధులు, ఆస్తుల వివరాలను రైతులకు బహిరంగంగా వెల్లడిస్తారా? అని నిలదీశారు.
ఎన్నికలను ఎదుర్కొని రైతుల తీర్పు పొందే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు లేదా? అని శ్రీకాంత్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా పదవులను నామినేషన్ల ద్వారా కట్టబెట్టడం వల్ల సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.
ఎల్కతుర్తి సొసైటీ రైతులదేనని, ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల సొంత ఆస్తి కాదని స్పష్టం చేశారు. సొసైటీ నిధులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి పారదర్శకత పాటించి రైతులకు అన్ని వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి రైతులు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశం కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.
“నామినేటెడ్ పాలన వద్దు.. రైతుల చేత ఎన్నుకోబడిన పాలన కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.


Comments