స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి.!
- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి.
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్.
సత్తుపల్లి, సెప్టెంబరు 9 (తెలంగాణ ముచ్చట్లు):
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ సత్తుపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జేవీఆర్ కళాశాల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన రూ.11 వేల కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు భాను శ్రీకర్ మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సత్తుపల్లి ఉమెన్స్ జూనియర్ కళాశాల ప్రహరీ గోడ కూలిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రవీణ్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నేత కొలికపోగు సర్వేశ్వరరావు, నవీన్, రామ్చరణ్, దీపు, చరణ్, పవన్, మణికంఠ, గౌతమి, త్రిపుర, శైలజ తదితరులు పాల్గొన్నారు.


Comments