బీఆర్ఎస్ నేతల అరెస్టుపై నిరసన.
సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లిలో ర్యాలీ.
సత్తుపల్లి, సెప్టెంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సోమవారం జీవీ మాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల కండువాలు, నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీకి నల్ల టీషర్టులు ధరించి వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షం హక్కు అని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్రావు తదితర నేతలను అదుపులోకి తీసుకున్న తీరును ఆయన ఖండించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో నల్ల దుస్తులతో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ ప్రజాప్రతినిధులకు ఆ హక్కు ఉండాలని సండ్ర అన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై ప్రజల్లో ప్రశ్నలు ఉన్నాయని సండ్ర అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు స్కూటర్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్లో తులం బంగారం, అర్హులైన పేదలకు ఇళ్ల వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని సండ్ర స్పష్టం చేశారు. అనంతరం ప్రజల నుంచి సేకరించిన వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ప్రజావాణిలో అధికారులకు సమర్పించారు.


Comments