దేశరాజ్పల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ.
నూతన గ్రామపంచాయతీ, విశ్వబ్రాహ్మణ సంఘ భవనాలకు శంకుస్థాపన
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా పనులకు శ్రీకారం
కరీంనగర్, సెప్టెంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దేశరాజ్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణంతో పాటు విశ్వబ్రాహ్మణ కుల సంఘ భవన నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూతన గ్రామపంచాయతీ భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు పాలనాపరమైన సేవలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. విశ్వబ్రాహ్మణ కుల సంఘ భవనం నిర్మాణం పూర్తయితే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



Comments