గురువులే భవిష్యత్ తరాలకు దిక్సూచి.
హిమ్మత్నగర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
వీణవంక, సెప్టెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
గురువుల పట్ల గౌరవాన్ని చాటుతూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్ ఎంపీయూపీఎస్ విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ గురువులకు ఘనంగా సన్మానం చేశారు.
తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలు, పూలబొకేలతో సత్కరించి గురువుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గోనె సత్యం మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై శ్రద్ధగా విద్యను అభ్యసించాలని సూచించారు. ఉపాధ్యాయులు బోధించే విద్యాబుద్ధులను ఆచరిస్తూ క్రమశిక్షణతో మెలిగి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
గురువుల మార్గదర్శకత్వంలోనే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


Comments