చెక్డ్యామ్తో రైతులకు తీరని నష్టం.. ఐదేళ్లుగా పంటలకు దూరం.
వీణవంక, సెప్టెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కల్వల–బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి సంపత్ ఆరోపించారు. చెక్డ్యామ్ కారణంగా వరద నీరు పొలాల్లోకి చేరడంతో సుమారు పది మంది రైతులు ఐదేళ్లుగా పంటలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదల కారణంగా సుమారు 12 ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు తెలిపారు. బాధిత రైతుల పొలాలను పరిశీలించిన సుంకరి సంపత్.. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏళ్ల తరబడి పంటలు సాగు చేసుకోలేక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు దెబ్బతిన్న భూములను తిరిగి సాగుకు అనుకూలంగా మార్చే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యను పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


Comments