సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన.
పెద్దమందడి,సెప్టెంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా పోలీసుల సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీ నాయక్, సైబర్ క్రైమ్ ఎస్ఐ రవి ప్రకాశ్, పెద్దమందడి ఎస్ఐ జాలంధర్ రెడ్డి, భరోసా, షీ టీమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ నాయక్ మాట్లాడుతూ.. సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోప్య సంకేతాలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద సందేశాలు, లింకులను తెరవకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆన్లైన్ మోసాలు, పెట్టుబడి మోసాలు, నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలు, ఆన్లైన్ బెట్టింగ్ల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.సైబర్ క్రైమ్ ఎస్ఐ రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. బాలలపై లైంగిక దాడులకు సంబంధించిన చట్టవిరుద్ధ చిత్రాలు, దృశ్యాలను సృష్టించడం, భద్రపరచడం, ఇతరులకు పంపడం నేరమని తెలిపారు. అలాంటి సమాచారం ఎదురైతే ఇతరులకు పంపకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్ఐ ఎం.డి. అమ్జాద్ తెలిపారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కళాశాల సహాయ సంచాలకురాలు డా. వీణా జోషి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments