గోవింద నామస్మరణతో మార్మోగిన కొండలయ్య గుట్ట.
శ్రావణ చివరి శనివారం స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.
పెద్దమందడి,సెప్టెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్పల్లి కొండలయ్య గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం శ్రావణ మాసపు చివరి శనివారం భక్తజన సందోహంతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనం
కోసం జగత్పల్లి గ్రామస్తులతో పాటు వనపర్తి మండలంలోని రాజనగరం, నాగవరం, రాజపేట, వనపర్తి పట్టణాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.గుట్ట కింద కొలువైన అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా అంటూ గోవింద నామస్మరణతో కొండపైకి చేరుకున్నారు. భక్తుల నామస్మరణతో కొండలయ్య గుట్ట మార్మోగింది. కొండపై స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం చిన్న తిరుమలను తలపించింది.శ్రావణ శనివారం స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, సహస్రనామార్చనలు నిర్వహించారు.జగత్పల్లి గ్రామానికి చెందిన దాత గట్టు నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేయడం పట్ల దాతను పలువురు అభినందించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటన్న యాదవ్, మాజీ సర్పంచులు మోహన్ కుమార్ యాదవ్, నిరంజన్ గౌడ్, నారాయణ యాదవ్, గ్రామ ప్రముఖులు బూరుగుపల్లి శ్రీనివాసరెడ్డి, జి. శ్రీనివాస యాదవ్, వార్డు సభ్యులు మోజర్ల రాములు, కుమార్ యాదవ్, దత్తాత్రేయ రెడ్డి, కృష్ణ సాగర్, సురేష్ చారి, బుచ్చన్న నాయుడు, వెంకటేష్ నాయుడు, తుప్పుడ భాస్కర్ యాదవ్, తిరుపతి నాయుడు, కృష్ణుడు, చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.


Comments