కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ రణభేరి.
విద్యార్థులు, నిరుద్యోగులతో సండ్ర వెంకట వీరయ్య ర్యాలీ.
సత్తుపల్లి, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను 1000 రోజులు పూర్తయినా అమలు చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. బీఆర్ఎస్ చేపట్టిన ‘1000 రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై పోరుబాట’లో భాగంగా సత్తుపల్లిలో శనివారం విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, 1000 రోజులు గడిచినా ఆ హామీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, విద్యా భరోసా కార్డుల హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, గురుకుల విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సండ్ర ఆరోపించారు. ప్రతి జిల్లాలో యూపీఎస్సీ ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, పోటీ పరీక్షల దరఖాస్తు రుసుముల మినహాయింపు వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్లోని హామీలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి, వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హా
మీలను అమలు చేయకపోతే కేటీఆర్ నాయకత్వంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Comments