తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి కొనసాగుతున్న చేరికల పరంపర.
కాట్రపల్లిలో భారీగా చేరికలు.. మహిళా విభాగం నూతన కమిటీ ఏర్పాటు.
హుజురాబాద్, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత భారీగా చేరుతున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెల్లి అరుణ, జిల్లా కార్యదర్శి దాట్ల శ్రీనివాస్ ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల అధ్యక్షుడు *తిరగమల్ల నాగార్జున* ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, పురుషులు, మహిళలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి తిరగమల్ల నాగార్జున పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
అనంతరం కాట్రపల్లి గ్రామ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం కమిటీని ఏర్పాటు చేశారు. మహిళా విభాగం అధ్యక్షురాలుగా మాడుగుల శ్రీ విద్య, ప్రధాన కార్యదర్శిగా మైస సరితను నియమించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తిరగమల్ల నాగార్జున మాట్లాడుతూ పార్టీ పదవులను కేవలం హోదాగా భావించకుండా బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి వారి గొంతుకగా మారాలని, గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని అన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరింత బలోపేతం చేసి, భవిష్యత్తులో అధికారంలోకి తీసుకువచ్చే వరకు నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల రాజు, మండల అధికార ప్రతినిధి బొడ్డు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments