యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి.
- ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ కోసం బీఆర్ఎస్ డిమాండ్.
- మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు):
యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం అశ్వారావుపేటలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గురుకులాలను అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించామని మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడిచినా 13 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఉప్పల వెంకటరమణ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగాలకు ప్రస్తుతం నియామక పత్రాలు అందజేసి తామే ఉద్యోగాలు కల్పించినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ‘‘మేము భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటారా? నియామక పత్రాలు ఇస్తే కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చినట్టేనా?’’ అని ప్రశ్నించారు. యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments