కాంగ్రెస్–బీజేపీ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి.
*66 డివిజన్ల సమస్యలపై ప్రజావాణిలో వినతులు*
*నగర సమస్యలు పరిష్కరించడంలో విఫలం: చల్లా హరిశంకర్*
కరీంనగర్, సెప్టెంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ):
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, కరీంనగర్ నగరపాలక సంస్థలో బీజేపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏడో రోజు కరీంనగర్లో ఆందోళన హోరెత్తింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన నిర్వహించి, పాలకుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు.
ఈ సందర్భంగా హరిశంకర్ మాట్లాడుతూ.. నగరంలో వీధిదీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, చెత్తాచెదారం పేరుకుపోయిందని విమర్శించారు. తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మున్సిపల్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, నగరపాలక సంస్థలోని బీజేపీ పాలకులు కలిసి కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో, బీజేపీ నగర పాలనలో ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ఎప్పటికీ పోరాడుతుందని, ప్రజలకు అండగా గులాబీ శ్రేణులు ఉంటాయని హరిశంకర్ భరోసా ఇచ్చారు.
నిరసన అనంతరం నగరపాలక సంస్థ ప్రజావాణిలో 66 డివిజన్లకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments