పలుస శంకర్ గౌడ్ సేవలకు దక్కిన గౌరవం.
సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో సేవలకు గుర్తింపు.
వనపర్తి,సెప్టెంబరు(07(తెలంగాణ ముచ్చట్లు):
సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలందిస్తున్న సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్కు గౌరవం దక్కింది. కొత్త తెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం నందికంది క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు.సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది క్షేత్రంలో నిర్వహించిన బొమ్మలపల్లకి ప్రతిభా పురస్కార సభకు పలుస శంకర్ గౌడ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలపై కొత్త తెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దృశ్యచిత్ర పోటీల్లో విజేతలైన వారికి ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు.సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాలకు పలుస శంకర్ గౌడ్ అందిస్తున్న సేవలను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్రబృందం ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. జాతీయ కార్యవర్గం, పాలక మండలి సభ్యులు మణికొండ వేదకుమార్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్రబృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి సన్మానించడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.రోజంతా కొనసాగిన ఈ కార్యక్రమంలో కొత్త తెలంగాణ చరిత్రబృందం ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, చరిత్ర పరిశోధకులు అరవింద్ ఆర్య, కపిలవాయి అశోక్బాబు, రవీందర్రెడ్డి, స్రవంతి విజయభాస్కర్రెడ్డి, రంగాచార్య, డాక్టర్ బైరోజు శ్యాంసుందర్, రాములు, గణేశ్కుమార్, శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments