హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు?
అల్వాల్, సెప్టెంబర్ 7 ( తెలంగాణ ముచ్చట్లు):
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లను వెంటనే అమలు చేసి ప్రజలకు ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్రెడ్డి, సబిత్ కిషోర్, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అల్వాల్ డీసీ భోగేశ్వర్, డీటీ పృథ్వీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, పెండింగ్లో ఉన్న హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని వారు కోరారు. హామీల అమలులో జాప్యం చేస్తే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.


Comments