హామీలతో గెలిచారు.. అమలుతో నిలబడాలి.
*ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదు.*
*కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రక్షణ సేన ఆగ్రహం*
కరీంనగర్, సెప్టెంబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు పెట్టుబడి సాయం, రైతులకు రూ.500 బోనస్, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డులు, సంక్షేమ బోర్డు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, యువ వికాసం కింద ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు తులం బంగారం వంటి హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బీసీ సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్ల కేటాయింపు, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ‘అంబేద్కర్ అభయహస్తం’ కింద రూ.12 లక్షల సాయం, మైనారిటీల సంక్షేమానికి రూ.4 వేల కోట్ల నిధులు వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్తో పాటు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, అర్హులైన జర్నలిస్టులు, ప్రాక్టీసింగ్ న్యాయవాదులకు ఇంటి స్థలాలు, గల్ఫ్ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకుని మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని హరిప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణకు హామీల ప్రభుత్వం కాకుండా హామీలను అమలు చేసే నాయకత్వం అవసరమని, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వంలోనే అది సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి లింగంపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments