క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్.
బాలికలు క్రీడల్లో మరింతగా రాణించాలి.
మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్, సెప్టెంబర్ 9(తెలంగాణ ముచ్చట్లు ):
యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా సిటీ లెవల్ రగ్బీ టోర్నమెంట్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ పోటీలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా–అస్మిత వంటి కార్యక్రమాలను యువ క్రీడాకారులు, ముఖ్యంగా బాలికలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమాల లక్ష్యమన్నారు.
కరీంనగర్ జిల్లాలో రగ్బీ అభివృద్ధికి కృషి చేస్తున్న రగ్బీ అసోసియేషన్ ప్రతినిధులను మేయర్ అభినందించారు. కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ శివకృష్ణ, పెద్దపల్లి జిల్లా సెక్రటరీ రామకృష్ణ, సిద్దిపేట జిల్లా సెక్రటరీ అజయ్, రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రటరీ హను
మంతు, జగిత్యాల జిల్లా సెక్రటరీ మహిపాల్, వెంకటేశ్వర హాస్పిటల్ అడ్మిన్ వెంకటేశ్వర్లు, రగ్బీ డెవలప్మెంట్ ఆఫీసర్ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.


Comments