వీరవనిత ఐలమ్మ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి.
ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
సీపీఎం మండల కార్యదర్శి మునిగేల రమేష్
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకొని స్టేషన్ ఘనపూర్లో సీపీఎం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీఎం మండల కార్యదర్శి మునిగేల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.ఈ సందర్భంగా మునిగేల రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణలో దొరలు, భూస్వాముల దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. భూమి, హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అణచివేతకు ఏమాత్రం భయపడకుండా ఎర్రజెండా అండతో పోరాడి, బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ధైర్యం, పోరాట స్ఫూర్తిని నింపారని గుర్తు చేశారు.
ఐలమ్మ జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ, అణచివేతను ప్రశ్నించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ స్ఫూర్తితో నేటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు నిర్వహించాలని సూచించారు.పేదలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం సాగించిన ఐలమ్మ పోరాటం అణచివేతకు వ్యతిరేకంగా నిలిచిన ధైర్యానికి ప్రతీక అని అన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఐలమ్మకు నిజమైన నివాళి అని రమేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య, కత్తుల రాజు, గట్ల మల్లారెడ్డి, తోడెంగల ఐలయ్య, చిలుముల్ల భాస్కర్, మంద మహేందర్, మేదరబోయిన కరుణాకర్ యాదవ్, పిట్టల రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


Comments