శ్రీశైలంలో నీళ్లున్నా సాగుకు అందించలేని అసమర్థ ప్రభుత్వం.
కేఎల్ఐ పంపులు 24 గంటలు నడపాలి.. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
రేవల్లి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) స్టేజ్-3 పంప్హౌస్ను మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్నా కేఎల్ఐ పంపులను పూర్తి సామర్థ్యంతో నడపడం లేదన్నారు. ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేఎల్ఐ పంపులకు నిరంతర విద్యుత్ సరఫరా చేసి 24 గంటలు పంపులు నడిపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, శ్రీశైలంలో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులపై ఉన్న శ్రద్ధ కంటే ఫ్యూచర్ సిటీ, ఇతర అంశాలపై ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉందని విమర్శించారు.మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఏపీకి నీళ్లు తరలిపోతున్నా తెలంగాణకు సాగునీరు అందడం లేదన్నారు. కేఎల్ఐ మోటార్లకు విద్యుత్ సరఫరా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పంటలు ఎండిపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించాలన్న సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేఎల్ఐ మోటార్లను నిరంతరం నడిపిస్తూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలు కాపాడే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. కేఎల్ఐ పంపులను నిలిపివేయకుండా పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించకపోతే పంప్హౌస్ల వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతులు అధైర్యపడవద్దని, వారి పంటలను కాపాడేందుకు అండగా ఉంటామని తెలిపారు.


Comments