ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
శాంతి కమిటీల సమన్వయ సమావేశంలో పోలీస్ కమిషనర్.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతి సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్ దత్ సూచించారు. సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ నవరాత్రుల ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పీస్ కమిటీలతో వినాయక నవరాత్రి విగ్రహాల ఏర్పాట్లు, బందోబస్తుపై పోలీసు కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... కమిషనరేట్ పరిధిలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మతపరమైన సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలన్నారు.
అదేవిదంగా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ప్రజలకు అవగాహన కల్పించడం. అనుమానాస్పద సమాచారం లేదా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
గణేష్ నవరాత్రుల ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా భద్రతకు సంబంధించి, పోలీసు, నగరపాలక సంస్థ , అగ్ని మాపక శాఖ, నీటి పారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేస్తూ, శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరుపుకునేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు.
గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి కమిటీ సభ్యులు పోలీసులు సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.
వినాయక విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సమయంలో నిర్ణయించిన మార్గాలు, సమయాలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. మతపరమైన సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మోహన్ బాబు, బాలకృష్ణ భానుప్రకాష్ పాల్గొన్నారు.


Comments