అనంతసాగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు.
*పౌష్టికాహారంపై అవగాహన కల్పించిన అధికారులు – చిన్నారులు, తల్లులకు సూచనలు*
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో
అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
*సమతుల్య ఆహారంతో ఆరోగ్యకరమైన జీవనం*
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చాలని సూచించారు.
చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
*పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు*
పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా వివిధ రకాల పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రదర్శించి, వాటి ప్రయోజనాలను వివరించారు. పిల్లలు, తల్లులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పూర్ణచంద్రరావు, గ్రామ సెక్రెటరీ నాగేశ్వరరావు, అంగనవాడి టీచర్ పి. ఉమ, ఏఎన్ఎం. సంధ్య అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.


Comments