భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి.
సర్వేకు ముందు రైతులకు సమాచారం ఇవ్వాలి
-- వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
భూ రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.రీ-సర్వేలో రోవర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూముల కొలతలు చేపడుతున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ సర్వేయర్లకు పలు సూచనలు చేశారు. ముందుగా భూముల సరిహద్దులను నిర్ధారించి అనంతరం సర్వే చేపట్టాలని, సర్వేకు వెళ్లే ముందు సంబంధిత రైతులకు సమాచారం అందించాలని సూచించారు. రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించి, వారి సందేహాలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు.భూముల కొలతలు, సరిహద్దులు, వివరాలను సాంకేతిక పరికరాల సహాయంతో కచ్చితంగా నమోదు చేయాలని, రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. సర్వేను వేగవంతం చేసేందుకు అవసరమైన సాంకేతిక రోవర్లను కొనుగోలు చేయాలని జిల్లా సర్వే అధికారిని ఆదేశించారు.అనంతరం గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడి భూ రీ-సర్వే ప్రాముఖ్యతను వివరించారు. భూముల సరిహద్దులు, కొలతలు, రికార్డుల నవీకరణపై వారి సందేహాలను నివృత్తి చేశారు. రీ-సర్వే ద్వారా భూ వివరాలు మరింత కచ్చితంగా నమోదై, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. రీ-సర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు అధికారులు, సర్వేయర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని కోరారు.కార్యక్రమంలో సర్వే ఏడీ శ్రీనివాసులు, తహసిల్దార్ సుగుణ, ఎంపీడీవో విజయసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ రవీందర్, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments