వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
* సకాలంలో చెల్లింపులతో మరింత అధిక రుణాలు పొందే అవకాశం
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని వీధి వ్యాపారులు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సూచించారు. పట్టణ పరిధిలోని వీధి వ్యాపారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
వీధి వ్యాపారులు చిన్నచిన్న వ్యాపారాల నిర్వహణ కోసం పొందుతున్న రుణాలను సక్రమంగా వినియోగించుకుని తమ జీవనోపాధిని మరింత మెరుగుపరుచుకోవాలని చైర్మన్ సూచించారు. తీసుకున్న రుణాలను నిర్ణీత గడువులో క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాలని తెలిపారు. రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడటంతో పాటు భవిష్యత్లో మరింత అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న వీధి వ్యాపారులు రుణాలను ఇతర అవసరాలకు మళ్లించకుండా వ్యాపార అభివృద్ధికే వినియోగించాలని సూచించారు. తద్వారా వ్యాపారాన్ని విస్తరించుకుని కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మెప్మా ఇన్చార్జ్ టీఎంసీ మల్లీశ్వరి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అర్పిత, పలువురు వీధి వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


Comments