యువతలో దేశభక్తి, బాధ్యతా భావం పెంపొందాలి.
*వివేకానంద కళాశాలలో “నా దేశం – నా జాతి – నా బాధ్యత” కార్యక్రమం*
*స్వామి వివేకానంద సందేశాలు నేటి యువతకు మార్గదర్శకం-మేయర్ కొలగాని శ్రీనివాస్*
కరీంనగర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో “నా దేశం – నా జాతి – నా బాధ్యత” అనే అంశంపై వ్యక్తిత్వ నిర్మాణ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిందని మేయర్ తెలిపారు. స్వామి వివేకానంద చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
విద్యార్థులు స్వామి వివేకానంద బోధనలు, ఆధ్యాత్మిక సందేశాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నతమైన విలువలతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
జిల్లా యువజన అధికారి జి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, సన్మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో ఏసీఓ బి. సంపత్ కుమార్, ఏవో బి. శ్రావణ్ కుమార్, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. గోపికృష్ణ, నేషనల్ యూత్ ప్రాజెక్ట్ బాధ్యులు కె. యాదవరాజు, ఎం.డి.తాహర్ పాషా, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments