సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్ల అశోక్ రెడ్డి.
స్టేషన్ ఘన్ పూర్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన చారిత్రాత్మక సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్ల అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్టేషన్ ఘన్ పూర్ పట్టణంలోని మా గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం అప్పట్లో భారత యూనియన్లో విలీనం కాలేదని, అనంతరం సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని అశోక్ రెడ్డి గుర్తుచేశారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులు, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈ విముక్తి సాధ్యమైందన్నారు. ఖాసిం రజ్వీ, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉందన్నారు.గత ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యతను సరైన రీతిలో గుర్తించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సెప్టెంబర్ 17ను కేవలం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా ప్రకటించి, అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని కోరారు.
సెప్టెంబర్ 17 చారిత్రక నేపథ్యం, తెలంగాణ విమోచన పోరాటం, అమరవీరుల త్యాగాల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్, జాఫర్గఢ్, చిల్పూర్ మండలాల అధ్యక్షులు సట్ల వెంకటరమణ, కోరుకుప్పుల నాగేష్, గంటే ఉపేందర్ యాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా నాయకుడు రాడపాక ప్రదీప్, నాయకులు రాజ్ కుమార్, ఎల్లయ్య, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments