ఇళ్ల మధ్య సెల్ టవర్ ఏర్పాటుపై రఘునాథ్ కాలనీ వాసుల ఆందోళన.
పనులను అడ్డుకుని పోలీసులకు సమాచారం..
టవర్ నిర్మాణాన్ని నిలిపివేసిన పోలీసులు
వరంగల్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 29వ డివిజన్ రఘునాథ్ కాలనీలో ఇళ్ల మధ్య ప్రైవేటు సంస్థకు చెందిన సెల్ టవర్ ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు అక్కడికి చేరుకుని టవర్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
ఇళ్ల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల తమకు ఇబ్బందులు కలుగుతాయని, టవర్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నివాస ప్రాంతాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయకుండా వెంటనే నిర్మాణాన్ని నిలిపివేసి, టవర్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని స్థానికులు మట్టవాడ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. పరిస్థితిని సద్దుమణిగేలా చేసి, సెల్ టవర్ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయించారు.
ఈ సందర్భంగా రఘునాథ్ కాలనీ వాసులు మాట్లాడుతూ.. తమ నివాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన తమలో ఉందన్నారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ను వెంటనే తొలగించాలని అధికారులను కోరారు.ఈ ఆందోళనలో రఘునాథ్ కాలనీకి చెందిన సదాంత్ కొడకండ్ల, మామునూరి రాజు, గాలయ్య, ఇజగిరి భీమరాజ్, శివకుమార్, రాజు, ప్రమోద్, రాజేందర్ తదితరులతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.


Comments