కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి.
డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్పై ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాసిన అమర్ ప్రసాద్పై చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిషేధించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.ఇందిరా పార్క్ వద్ద దళిత సమాజానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్పై అభ్యంతరకరమైన సాహిత్యంతో పుస్తకం రాయడం దళిత సమాజాన్ని తీవ్రంగా బాధించిందన్నారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిషేధించాలని కోరారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని పిడమర్తి రవి హెచ్చరించారు.
ఇటీవల దళిత సమాజానికి సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ కేసీఆర్, కేటీఆర్లు దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్న దళిత సమాజాన్ని అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, కేఆర్ నాగరాజు, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, సతీష్ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, మీసాల మహేష్, నక్క మహేష్, దేవరకొండ నరేష్, జోగు గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments