కాంగ్రెస్ పట్టణ కమిటీకి తీవ్ర పోటీ.
అనుబంధ కమిటీల ఏర్పాటుకు 100 దరఖాస్తులు.
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్పూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీతో పాటు అనుబంధ కమిటీల ఏర్పాటుకు నాయకుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు ఆదివారం స్టేషన్ ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీల ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు.పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు అధ్యక్షతన, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పూర్తిస్థాయి పట్టణ కమిటీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కమిటీలను ఏర్పాటు చేసేందుకు నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు పట్టణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వివిధ కమిటీల పదవుల కోసం పోటీలో ఉన్న నాయకుల నుంచి 100 దరఖాస్తులు అందాయని వెల్లడించారు.
పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో అందిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి, పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం తుది జాబితాను ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అందజేస్తామని వారు తెలిపారు. పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్న వారికి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు కమిటీల్లో ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్లు బొల్లు లక్ష్మీ, పొన్న రవి, సౌదరపల్లి సంపత్ రాజ్, 18 డివిజన్ల అధ్యక్షులు, తిరుమలనాథ దేవస్థానం చైర్మన్ నీల నర్సింహులు, డైరెక్టర్ ప్రశాంత్, జిల్లా నాయకులు బూర్ల శంకర్, నీల గట్టయ్య, పోగుల సారంగపాణి, పెసరు సారయ్య, పోశాల కృష్ణ, రాఘవరెడ్డి, గండ్ల రాజు, సత్తు రవి, ఐలపాక శ్రీను, అన్నెపు కుమార్, తోకల రాజు, గుర్రం రమేష్, అంగడి కృష్ణతో పాటు మహిళా, యువజన నాయకులు పాల్గొన్నారు.


Comments