ప్రతిభా పురస్కార గ్రహీత నక్క విష్ణుకు ఘన సన్మానం.
వనపర్తి,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి బొమ్మలపల్లకి వీడియోగ్రఫీ పోటీల్లో ద్వితీయ బహుమతితో ప్రతిభా పురస్కారం అందుకున్న నక్క విష్ణును సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఆదివారం స్థానిక రేడియంట్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరంగాపురంపై నక్క విష్ణు రూపొందించిన లఘు చిత్రానికి పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. ప్రతిభా పురస్కార ప్రశంసాపత్రంతో పాటు శాలువా, రూ.6 వేల నగదు బహుమతిని అందజేసినట్లు తెలిపారు.వనపర్తి జిల్లాలో ఎన్నో ప్రాచీన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని, వాటి విశిష్టతను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. యువత తమ ప్రతిభను చాటుకునేలా ప్రోత్సహించాలని, పురస్కారాలు కళాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పలుస శ్రీకర్ గౌడ్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం జిల్లా కన్వీనర్ డా. బైరోజు శ్యాంసుందర్, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, డా. కంటే నిరంజనయ్య, బండారు శ్రీనివాస్, డా. తూర్పింటి నరేశ్కుమార్, పెరుమాళ్ల శ్రీనివాస్, దేశి రాములు, యాదవ్ దినేశ్ తదితరులు పాల్గొన్నారు.


Comments