ఎల్నినో ప్రభావం.. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి .
గుడిసెల్లో నివసించే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు
-- జిల్లా ప్రత్యేక అధికారి వి.పి గౌతమ్
వనపర్తి,ఆగస్టు05(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించేందుకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి వి.పి. గౌతమ్ ఆదేశించారు.బుధవారం వనపర్తి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎల్నినో పరిస్థితులు, పంటల మార్పిడి, ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇప్పటివరకు 18 శాతం లోటు నమోదైనట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేరుశెనగ సాగును 40 వేల ఎకరాలకు, మినుముల సాగును 30 వేల ఎకరాలకు పెంచడంతో పాటు కందుల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని ఏడాదికి 6 వేల ఎకరాలకు పెంచి, 7 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గుడిసెల్లో నివసించే అర్హులందరికీ ఇళ్ల మంజూరు, రూఫ్ రీప్లేస్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సీపీఓ హరికృష్ణతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Comments