వనపర్తి ప్రెస్క్లబ్ నిర్మాణానికి రూ.20 లక్షలు.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ఎస్డీఎఫ్ నిధుల మంజూరు.
వనపర్తి,ఆగస్టు05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్క్లబ్ భవన నిర్మాణానికి రూ.20 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) ద్వారా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ప్రెస్క్లబ్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వనపర్తి పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక జర్నలిస్టులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు.జర్నలిస్టులకు శాశ్వత వేదికగా నిలిచేలా సురవరం ప్రతాపరెడ్డి పేరుతో ప్రెస్క్లబ్ భవనాన్ని నిర్మించాలని వారు కోరారు. జర్నలిస్టుల విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సానుకూలంగా స్పందించగా, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.ప్రెస్క్లబ్ భవనం నిర్మాణం పూర్తయితే జర్నలిస్టుల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడనుంది. ప్రజలకు, మీడియాకు మధ్య సమాచార మార్పిడిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ భవనం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల విజ్ఞప్తికి వెంటనే స్పందించి, ప్రెస్క్లబ్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మీడియా అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


Comments