వేంసూరు టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.
- మంటల్లో చిక్కుకున్న ఉల్లిపాయల వ్యాన్.
- లారీని ఢీకొని అగ్నికి ఆహుతి.
- ఇద్దరికి తీవ్ర కాలిన గాయాలు.
- సత్వర వైద్యసేవలతో ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది.
వేంసూరు, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు గ్రీన్ఫీల్డ్ టోల్ప్లాజా సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ మంటల్లో చిక్కుకుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్కు ఉల్లిపాయల లోడుతో బయలుదేరిన వ్యాన్, అదే మార్గంలో ముందుగా వెళ్తున్న గ్రానైట్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో వ్యాన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ప్రేమ్కుమార్ (30), సుఖేష్ (25)లకు సుమారు 50 శాతం మేర తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వేంసూరు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ తేనేటి మురళీకృష్ణ, పైలెట్ కోండ్రు రవి గాయపడిన వారికి ఆక్సిజన్ అందిస్తూ, సెలైన్ ఎక్కించి, కాలిన గాయాలకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఫైర్ బ్లాంకెట్తో శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ అత్యవసర వైద్యసేవలు అందించి, మెరుగైన చికిత్స కోసం సత్తుపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు విశేష కృషి చేసిన వేంసూరు 108 సిబ్బందిని ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజరుద్దీన్, ఖమ్మం జిల్లా 108
మేనేజర్ ఆలేటి ప్రణయ్కుమార్, వేంసూరు టోల్ప్లాజా సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు.


Comments