తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
* దామెర సుధాకర్కు సన్మానం.
* నాలుగు దశాబ్దాల విద్యా సేవలకు గుర్తింపుగా ఘనంగా పదవీ విరమణ సత్కారం
జమ్మికుంట టౌన్ జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
నాలుగు దశాబ్దాల పాటు విద్యా రంగంలో విశిష్ట సేవలందించిన జమ్మికుంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామెర సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. విద్యార్థుల అభ్యున్నతి, క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేసిన కృషిని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు, అభిమానులు కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విద్యా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడి సేవలు తరగతి గది గోడలకే పరిమితం కావని, మంచి విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. దామెర సుధాకర్ అందించిన సేవలు జమ్మికుంట ప్రాంత విద్యా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడుతూ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుంకరి యాదయ్య, పాంతటి రవీందర్, ఎం.ఏ. రషీద్, కొంగల కుమార్, మారేపల్లి అజయ్ తదితరులు పాల్గొని దామెర సుధాకర్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.


Comments