ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.
సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్.
పెద్దమందడి,జులై30(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో డ్రైనేజీలను దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన సర్పంచ్, ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామంలో సుమారు 15 నుంచి 20 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. స్లాబుల ఏర్పాటు పనులను శుక్రవారం నుంచి ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.అనంతరం వర్షాభావ పరిస్థితులు, నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, వాడిన నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో నీటి నిల్వలు పెరిగి భూగర్భ జలాలు వృద్ధి చెందాలంటే ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు.గ్రామంలో సామాజిక ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్పిట్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకోసం గ్రామంలో ఐదు ప్రాంతాలను గుర్తించామని, త్వరలో సంబంధిత పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముప్పూరు గణేష్ కుమార్, మద్దిరాల శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, ముప్పూరి రాములు, బుచ్చయ్య, ముప్పూరు కొండన్న, కుర్మయ్య, సాయికుమార్, వై. బాలకృష్ణ, రమేష్, రాజు, సాయిలు, ఆనంద్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments