కోరపల్లి పురాతన శివాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. దరఖాస్తులకు దేవాదాయ శాఖ ఆహ్వానం.
జమ్మికుంట టౌన్ జూలై 20 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలోని పురాతన శ్రీ శివాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే దిశగా దేవాదాయ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిలి రాకేష్ ముదిరాజ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన వరంగల్ జోన్ దేవాదాయ శాఖ, ఆలయానికి ఐదుగురు సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక నోటీసు జారీ చేసింది.
తెలంగాణ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు, దేవాదాయ చట్టం–1987 (చట్టం నెం.30/1987), 2007 సవరణ చట్టం, ట్రస్టీల నియామక నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ తెలిపింది. నోటీసు అందిన తేదీ నుంచి 20 రోజులలోపు అర్హులైన, ఆసక్తి గల వ్యక్తులు ట్రస్టీ పదవులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కూడా ఇతరులతో సమానంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
దరఖాస్తులను నిర్దేశిత ఫారం–IIలో పూర్తి చేసి వరంగల్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేదా కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి 20 రోజులలోపు సమర్పించాలని ఆదేశించింది.
అదేవిధంగా నోటీసును ఆలయ నోటీసు బోర్డు, గ్రామ పంచాయతీ లేదా పురపాలక సంఘం కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, వరంగల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
దరఖాస్తుల గడువు ముగిసిన అనంతరం అందిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థుల పోలీసు ధ్రువీకరణ అనంతరం నిబంధనల మేరకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు దేవాదాయ శాఖ వెల్లడించింది.


Comments