అంబేద్కర్ భవనం, దళిత బంధుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు వినతి.
హుజూరాబాద్ అభివృద్ధి అంశాలపై మంత్రి సానుకూల స్పందన.
హుజురాబాద్ , జూలై 16 (తెలంగాణ ముచ్చట్లు):
హుజూరాబాద్ పట్టణ అభివృద్ధి, దళిత సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అసంపూర్తిగా నిలిచిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణానికి తక్షణమే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే దళిత బంధు పథకం కింద పెండింగ్లో ఉన్న గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు త్వరగా పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని, వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రణవ్ కోరారు.
వినతులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు. హుజూరాబాద్కు సంబంధించిన అంశాలపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించినట్లు పేర్కొంటూ, అంబేద్కర్ భవనం నిర్మాణం, దళిత బంధు గ్రౌండింగ్ ప్రక్రియ, సంక్షేమ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన విషయాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో హుజూరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నట్లు వొడితల ప్రణవ్ తెలిపారు.


Comments