IIITలో సీటు సాధించిన వెన్నలకు స్ఫూర్తి ఫౌండేషన్ అండ.
- ఎస్ఎస్సీలో 571 మార్కులతో మండల ర్యాంక్.
- ఉన్నత విద్యకు రూ.15,200 ఆర్థిక సహాయం.
కల్లూరు, జూలై 4 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రతిభకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో స్ఫూర్తి ఫౌండేషన్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. కల్లూరు మండలం చండ్రుపట్ల జెడ్పీహెచ్ఎస్లో చదివి ఎస్ఎస్సీ పరీక్షల్లో 571 మార్కులతో మండల ర్యాంక్ సాధించి, బాసర IIITలో ప్రవేశం పొందిన ప్రతిభావంతురాలు రామిశెట్టి సాయి వెన్నలకు రూ.15,200 ఆర్థిక సహాయాన్ని అందజేసింది. స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో అమెరికాలో నర్సింగ్ రంగంలో ఉన్న ఓ దాత అందించిన ఈ ఆర్థిక సహాయాన్ని శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి కాటంనేని విజయలక్ష్మి, ఉపసర్పంచి రాధాకృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగమణి, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు విద్యార్థినికి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని సాధించిన విజయం గ్రామానికి గర్వకారణమని, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో స్ఫూర్తి ఫౌండేషన్ విద్యార్థులకు అండగా నిలుస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినికి ఆకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్ద కాటంనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని తల్లి, కుటుంబ సభ్యులు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్తో పాటు ఆర్థిక సహాయం అందించిన అమెరికా దాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


Comments