ఏఎస్ఐ శివపార్వతి సేవలు అభినందనీయం.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,జూలై 04 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా పోలీసు శాఖలో 38 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించి ఏఎస్ఐగా పదవీ విరమణ చేసిన శ్రీమతి శివపార్వతి సేవలు అభినందనీయమని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఎస్ సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శివపార్వతిని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైందని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.సాధారణ హోం గార్డుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన శివపార్వతి, క్రమంగా పదోన్నతులు పొంది ఏఎస్ఐ స్థాయికి చేరుకోవడం ఆమె కృషి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు.38 సంవత్సరాలపాటు నిబద్ధతతో విధులు నిర్వహించి అందరి అభిమానాన్ని సంపాదించారని తెలిపారు.ముఖ్యంగా షీ టీమ్లో ఆమె చేసిన సేవలు మహిళల భద్రతకు ఎంతో తోడ్పడటమే కాకుండా, విధి నిర్వహణలో పలువురికి ఆదర్శంగా నిలిచాయని శంకర్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ సేవా సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్, కందూరు నారాయణరెడ్డి, బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు, రామ్రెడ్డి, కవిత, శ్రీలక్ష్మి, ఎడ్విన్, గంధం రాజు, జ్యోతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments