వ్యసనాలకు 'నో' చెప్పండి.. బాధ్యతాయుత పౌరులుగా ఎదగండి.
యువతకు ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ సందేశం.
జమ్మికుంట టౌన్ జూలై 4 (తెలంగాణ ముచ్చట్లు):
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం జమ్మికుంట మండలంలోని విలసాగర్ గ్రామంలో యువతకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, గ్రామ భద్రత కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం యువతతో కలిసి వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ హితం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments