హైవే దిగి తప్పించుకోవాలనుకున్నారు... సత్తుపల్లిలో చిక్కారు..
- ఒడిశా నుంచి హైదరాబాద్కు భారీ గంజాయి రవాణా భగ్నం.
- రూ.89.13 లక్షల విలువైన 166.360 కిలోల గంజాయి స్వాధీనం.
- డ్రైవర్ అరెస్టు.. మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాల గాలింపు.
సత్తుపల్లి, జూలై 4 (తెలంగాణ ముచ్చట్లు):
ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి రవాణాను సత్తుపల్లి పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ముందస్తు సమాచారం ఆధారంగా చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.89.13 లక్షల విలువైన 166 కిలోల 360 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరికి ఒడిశా నుంచి గంజాయి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో, కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ పర్యవేక్షణలో ఈగిల్ బృందం, పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న టయోటా ఎటియోస్ కారును తనిఖీ చేయగా, డిక్కీలోని ఆరు ప్లాస్టిక్ సంచుల్లో బ్రౌన్ టేప్తో చుట్టిన 80 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటి మొత్తం బరువు 166 కిలోల 360 గ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ.89.13 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు. కారుతో పాటు ఒక సెల్ఫోన్, రూ.500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
*హైవే వదిలినా పోలీసుల నుంచి తప్పించుకోలేక*
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఒడిశాకు చెందిన ప్రబిన్ భాత్రా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన బికారి అలియాస్ రోహన్ రూ.10 వేల పారితోషికం ఆశ చూపించి, 80 గంజాయి ప్యాకెట్లను హైదరాబాద్లో అప్పగించాలని సూచించాడు. ఈ మేరకు AP-39-AT-8240 నంబర్ గల టయోటా ఎటియోస్ కారులో గంజాయిని లోడ్ చేసి పంపించారు. జూలై 3 తెల్లవారుజామున దారకొండ జంక్షన్ నుంచి బయలుదేరిన నిందితులు రాజమండ్రి మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవేలో ప్రయాణించారు. ముందున్న పోలీసు తనిఖీల సమాచారం తెలుసుకుని వెంసూరు వద్ద హైవే దిగి సత్తుపల్లికి చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి, సత్తుపల్లి మీదుగా హైదరాబాద్కు వెళ్లాలని భావించారు. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు సమాచారం మేరకు సత్తుపల్లి సమీపంలో వాహనాన్ని అడ్డగించి నిందితుడిని పట్టుకుని భారీ గంజాయి రవాణాను భగ్నం చేశారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టంలోని 8(c), 20(b)(ii)(C), 27(A), 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు ప్రబిన్ భాత్రాను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న బికారి అలియాస్ రోహన్, చుక్క నాగేశ్వరరావు గౌడ్ల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
*సమాచారం ఇస్తే రివార్డు*
గంజాయి కొనుగోలు, విక్రయం, రవాణా లేదా వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గంజాయికి సంబంధించిన సమాచారం అందించే వారి పేర్లను పూర్తిగా గోప్యంగా ఉంచి తగిన నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ కేసు
దర్యాప్తులో ఎస్ఐ వీరప్రసాద్, ఎస్ఐ ప్రదీప్, ఈగిల్ బృందం సభ్యులు, సత్తుపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments