గురుకులాల నిర్లక్ష్యంపై సీపీఎం ఫైర్.
గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ.
హుజురాబాద్, జూలై 16 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే (ఎంజేపీ) గురుకుల విద్యాసంస్థలకు శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం హుజురాబాద్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధిపై పెద్దఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
పాఠశాలలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, బయటకు వేలాడుతున్న విద్యుత్ వైర్ల వల్ల విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. తగిన తరగతి గదులు లేక వరండాల్లోనే బోధన కొనసాగుతోందని, వెంటనే కొత్త భవనాలు, తరగతి గదులు నిర్మించాలని కోరారు. ప్రస్తుతం 465 మంది విద్యార్థినులు చదువుతున్న ఈ గురుకులంలో సరైన సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు.
పాఠశాల పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, పాత భవనానికి బదులుగా ఆధునిక శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవనాల కొరత కారణంగా కళాశాల తరగతులను అద్దె భవనాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని గురుకులాలకు శాశ్వత భవనాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్, మండల కమిటీ సభ్యులు ప్రతాప్ శ్రీనివాస్, ఇమ్మడి దేవ
య్య, కొంకటి చంద్రయ్య, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్, పార్టీ నాయకులు సతీష్, అజ్జు, కుమార్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments